రాయి.. ఎంతో హాయి

రాయి.. ఎంతో హాయి

చేతిరాతను పట్టిచ్చే వ్యక్తిత్వం

చేతిరాతకు దూరమవుతున్న విద్యార్థులు

కంప్యూటర్లు , టాబ్‌లు, సెల్‌ఫోనుల్లో పాఠాలు

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో తగద్గిన ఆదరణ

ప్రమాదకరమంటున్న చేతిరాత నిపుణులు

 

 

కొత్తవలస రూరల్‌ :   ఉత్తరాల కట్టను పోస్టుమన్‌ మోసుకొస్తుంటే చెప్పలేనంత ఉద్వేగం. ఆత్మీయులు రాసిన అక్షరాలు చదువుతుంటే అంతులేని సంబరం. జవాబు రాస్తుంటే ఇంకు లేని పెన్ను మొరాయించినప్పుడు భరించలేనంత కోపం. ఇదంగా ఈ తరానికి తెలియని మధురానుభవం. చేతిరాతకు ఆస్కారం లేని కంప్యూటర్‌ ప్రపంచం.. ఉత్తరాల కట్ట అటకెక్కింది. చేతిరాత అలవాటు తప్పింది. ముత్యాల్లాంటి అక్షరాలు కనిపించడం అరుదైపోయింది. చేతిరాతకు విద్యార్థి లోకం దూరమవుతోంది. చేతిరాత నేర్పించడంలో నిర్లక్ష్యం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అంతరించిపోయే కళల్లో ఒకటైపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు కేజీ నుంచి పీజీ వరకూ విద్యార్థులు చేతిరాత అందంగా ఉండేది. ప్రస్తుత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో వారి చేతిరాత మారుతోంది. రాత మెలకువలను నేర్పడంపై విద్యాసంస్థల్లో నిర్లక్ష్యం పెరుగుతోంది. సాధారణంగా పిల్లలు విడివిడిగా అక్షరాలు రాస్తుంటారు. కర్సివ్‌ (గొలుసుకట్టు) సహా రకరకాల అక్షరాలు కూడా రాస్తుంటారు. కానీ కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు సొంతంగా కొన్ని అక్షరాలను తమకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి. ఒక విద్యాసంస్థ అక్షరాల్లో టాప్స్‌ ఉండవు.. రింగ్స్‌ పెడతారు. విద్యార్థులకు డబుల్‌ రూల్‌ పుస్తకాల్లో చేతిరాత శిక్షణ ఇవ్వడం తగ్గింది. కొన్ని చోట్ల ఈ విధానం ఉన్నా ఏవి ఎలా రాయాలో తెలిపే అవగాహన ఉన్న బోధకుల్లేరు. విద్యార్థులు తప్పులు రాస్తున్నా దిద్దలేకపోతున్నారు.

 

 

చేతి రాత పద్ధతులు

సాధారణంగా విద్యార్థి రాసేటప్పుడు పుస్తకాన్ని తిన్నగా కాకుండా 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. అదే డైరెక్షన్‌లో బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు ఒకే కోణంలో పెట్టి పెన్నును కోన్‌ ఆకతిలో పట్టుకుని మెత్తగా రాయాలి. అప్పుడే ముత్యాల్లాంటి అక్షరాలు రాసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం పాఠశాలల్లో కంప్యూటర్లు, ట్యాబ్‌లను ఎక్కువగా వినియోగిస్తుడంటంతో విద్యార్థులు చేతిరాతకు క్రమేణా దూరమవుతున్నారు. ట్యాబ్‌ల్లో పాఠ్యాంశాలు, డిజిటల్‌ తరగతుల వల్ల రాసే విధానం క్రమంగా తగ్గుతోంది. 

 

వ్యక్తిత్వం గుర్తించే చేతిరాత

 బాగా ఒత్తిపట్టి రాసేవారిలో కోపం, ఆనందం, ఉత్సాహం, ఆహ్లాదం, క్షమాగుణం తదితర లక్షణాలుంటాయి. వీరికి స్పష్టమైన ఇష్టాలు కూడా ఉంటాయి. చిన్న అక్షరాలు రాసేవారు ఒంటరితనం, న్యూనతాభావం, పిసినారిగా ఉంటారు. పెద్దఅక్షరాలు రాసేవారు గుంపులో ఒకరుగా కాకుండా ప్రత్యేకత సంతరించుకుంటారు. ఖర్చు పెట్టే అలవాటు ఉంటుంది. మధ్య రకంలో రాసేవారు ఏకాగ్రతతో ఉంటూ అందరితో కలిసిపోతారు. సాధారణంగా ఏభాషలోనైనా అక్షరాలు అప్పర్, మిడిల్, లోయర్‌ అనే మూడు జోన్లు ఉంటాయి  వాస్తవాని కన్నా ఊహాలకు ప్రాధాన్యమిచ్చి గొప్పలకు తావిచ్చేవారు అప్పర్‌జోన్‌లోకి వస్తారు. ఎప్పుడూ సందిగ్ధంలో ఉంటూ పరిపక్వత చెందకుండా వర్తమానంలో జీవిస్తూ ఆశయాలు, ప్రణాళికలను ఎప్పటికప్పుడు మార్చుకునేవారు మిడిల్‌ జోన్‌ పరిధిలోకి వస్తారు. వైవిధ్యం ఎక్కువగా కోరుకుంటూ మానసికంగా శక్తివంతులైనవారు లోయర్‌జోన్‌లోకి వస్తారు.

 

కాలీగ్రఫీ

చేతి రాత అందంగా, ఆకర్షణీయంగా రాసే విధానాన్ని కాలీగ్రఫీ అంటారు. ఈ దస్తూరి మనిసి వ్యక్తిత్వానికి నిదర్శనం. సర్టిఫికెట్లు, ఇంజినీరింగ్, వైద్యవిద్యలో ముఖ్యమెన వాక్యాలను రాసే విధానాన్ని నేర్చుకునేందుకు విదేశాల నుంచి విశాఖ నగరంలోని మద్దిలపాలెం వద్ద రామాటాకీస్‌ వద్దనున్న కాలీగ్రఫీ ఇనిస్టిట్యూట్‌కు వస్తారు. చేతిరాతను బట్టి వ్యక్తి అభిరుచి, అలవాట్లు, వ్యక్తిత్వం చెప్పవచ్చని గ్రాఫోథెరపిస్టులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా చేతి రాతతో కేసులు ఛేదించిన సంఘటలున్నాయి.  

 

ప్రతి విద్యార్థికి ఒక స్టయిల్‌ :  ఎస్‌వీ పూర్ణ దేవి, శిక్షకురాలు

ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకూ విద్యార్థి ఫ్రీహేండ్‌తో రాస్తాడు. మూడో తరగతి నుంచి గొలుసుకట్టు (కర్సివ్‌) నేర్చుకుంటాడు. ఉపాధ్యాయుడు ఇచ్చిన కాపీరైటింగ్‌ తప్ప సొంతంగా రాయలేడు. అక్షరం పరిమాణం, పొడవు వెడల్పులు, పెన్ను పట్లుకోవటం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తే అందంగా రాస్తారు. సూచనలకోసం 9440042622 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

 

చేతిరాతలో నేనే ఫస్ట్‌  : రోషిణి, 4 తరగతి

ఇంతకుముందు నా దస్తూరి బాగుండేది కాదు. శిక్షణ తీసుకున్న తరువాత చాలా అందంగా రాస్తున్నా. మా పాఠశాలలో చేతిరాతలో నేనే ప్రథమస్థానంలో ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top