కూతురి వివాహం చేయలేకపోవడంతో..

కూతురి వివాహం చేయలేకపోవడంతో.. - Sakshi


కామేపల్లి(ఖమ్మం):

నమ్ముకున్న వ్యవసాయం నష్టాన్ని మిగిల్చింది. కన్న కూతురి వివాహం చేయాలంటే చేసిన అప్పులు తీరలేదు. అటు పెట్టుబడికి డబ్బులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడం, ఇటు కన్న కూతురి వివాహం చేయలేకపోవడంతో ఓ మహిళా రైతు తీవ్ర మనస్తాపం చెంది పురుగులమందుతాగి ఆత్మహత్యకు ఒడిగట్టింది. కామేపల్లి ఎస్సై గుండా రంజిత్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తుల కథనం ప్రకారం.. గోవింద్రాల గ్రామపంచాయతీలో గోవింద్రాలబంజరకు చెందిన గిరిజన మహిళా రైతు బానోత్‌ అరుణ (40).. భర్త బాలతో కలిసి తమకున్న 3.20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.



రెండు ఎకరాల్లో మిరప, ఎకరంలో పత్తి, అర ఎకరంలో వరి సాగుచేశారు. మిరప పంటకు అవసరమైన విత్తనాలను మహబూబాబాద్‌ నుంచి తీసుకొచ్చారు. అవి నకిలీ విత్తనాలు కావడంతో ఆశించినస్థాయిలో పంట చేతికిరాలేదు. పండిన పంటకు ధరలేదు. ఈ ఏడాది వ్యవసాయం కోసం రూ.3 లక్షలు అప్పులు చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండితే గతంలో చేసిన అప్పులు తీర్చి తమ కూతురు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పులు పెరిగిపోవడంతో తమ కుమార్తె వివాహం చేయలేకపోతున్నామని మహిళా రైతు అరుణ మనోవేదనకు గురైంది. దీనికి తోడు అప్పులు ఇచ్చిన వారు తమకు అప్పులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అరుణ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా మృతి చెందింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అరుణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్సై రంజిత్‌కుమార్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top