వివాహిత అనుమానాస్పద మృతి
అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించకుండానే త్రీటౌన్ పోలీసులు అర్దరాత్రి కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి తండ్రి డిల్లీరావు కథనం మేరకు... నగరంలోని లెక్చరర్స్ కాలనీలో నివాసముంటున్న లీలావతిబాయి(45), ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసరావు దంపతులు. వీరికి డిగ్రీ చదివే కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. గతంలో పలుమార్లు భర్తతో విభేదించి లీలావతిబాయి పుట్టింటికి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆమెను భర్త హింసించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆమెను చూసేందుకు ఇంటికి వస్తే కొట్టి పంపించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం సాయంత్రం లీలావతిబాయి చనిపోతే తల్లిదండ్రులకు గానీ, మీడియాకు గానీ సమాచారం అందించలేదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమకు ఇష్టమైన వ్యక్తులు చనిపోయారని, పుట్టింటి వారు ఆదరించడం లేదని మనస్థాపంతో లీలావతిబాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తండ్రి ఢిల్లీరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అల్లుడే చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేశారు. తన చిన్న కుమారున్ని లోబరుచుకుని పోలీసుల సహకారంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.