వడదెబ్బతో మహిళ మృతి


గార్లదిన్నె : గార్లదిన్నెకు చెందిన వడ్డే లక్ష్మీదేవి(55) వడదెబ్బతో శనివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్లిన ఆమె ఎండ తీవ్రతను తట్టుకోలేక నీరసించిపోయినట్లు వివరించారు. ఆ వెంటనే వాంతులై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందన్నారు. వెంటనే తోటి కూలీలు ఆమెను 108లో గార్లదిన్నె పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధరించినట్లు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ గోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు ఆమె మృతదేహాన్ని సందర్శించారు. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.      



కూడేరులో మరొకరు..

కూడేరు : కూడేరుకు చెందిన చియ్యేడు ఆదినారాయణ(50) వడదెబ్బతో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మేకలు, గొర్రెలను మేత కోసం తోలుకెళ్లిన ఆయన ఇంటికి వచ్చేసరికి బాగా నీరసించి సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top