రెండేళ్ల తర్వాత ఏపీలో దోమలే ఉండవు
విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత అనేక కష్టాలు వచ్చాయని, అన్నింటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షోభాన్ని సవాల్గా తీసుకుని అవకాశంగా మార్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ ఏడాది త్రైమాసిక ఫలితాలు సమీక్షించుకుంటూ వృద్ది సాధనలో ముందడుగు వేస్తున్నామని, వివిధ స్థాయిల్లో అధికారుల పనితీరు మెరుగు పరుస్తున్నామని తెలిపారు.
మొదటి త్రైమాసికంలో 12.26 శాతం వృద్ది రేటు సాధించామని, ఇది ఇండియా వృద్ది రేటు 7.31 శాతం కన్నా ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. మొదట భూగర్భ జల వనరులను కాపాడుకుంటున్నామని, రెండో ప్రయత్నంగా నదుల అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమంగా జల వనరులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి నాబార్డు అంగీకరించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, ఇప్పుడు కావాల్సింది నిర్ణీత సమయలోగా పనులు పూర్తీ చేసేందుకు కార్యాచరణ చేపట్టడమేనని ఆయన తెలిపారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే ఆశించిన వృద్ది సాధన సాధ్యపడుతుందన్నారు. ఇక ప్రపంచానికే సముద్ర ఆహారోత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని, 2018 నాటికీ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామలుగా మారాలని, దోమలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని సూచించారు. ప్రజలు సంతృపిగా ఉండాలంటే సమస్యలు లేకుండా చూడాలని, అక్టోబర్ 15 కల్లా ప్రజాసాధికార సర్వే పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు.