భార్యను పొడిచి చంపిన భర్త
బద్వేలు (వైఎస్సార్ జిల్లా): పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో గల వీరభద్రస్వామి దేవాలయం సమీపంలో గురువారం రాత్రి ఓ యువకుడు అతి కిరాతకంగా భార్య, మామలను హత్యచేశాడు. వివరాలలోకెళితే పట్టణంలోని వెంకటయ్య నగర్లో నివసిస్తున్న పందీటి చెన్నకేశవ సెల్పాయింట్లో మెకానిక్గా పనిచేస్తూ అదే వీధిలో ఉంటున్న మల్లికార్జున(55) కూతురైన అరుణ(25)ను ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోరుమామిళ్ల రోడ్డులో సంసారం పెట్టాడు.అయితే గత కొన్ని నెలలుగా చెన్నకేశవ భార్యను తరచూ వేధిస్తుండడంతో మామ అయిన మల్లికార్జున మందలిస్తుండేవాడని తెలిసింది.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం కూడా భార్య,భర్తలు ఇరువురు ఘర్షణపడుతుండడంతో విషయం తెలుసుకున్న మల్లికార్జున అక్కడికి వెళ్లి చెన్నకేశవతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన చెన్నకేశవ కత్తితో మల్లికార్జునను దారుణంగా పొడిచి హత్యచేశాడు. అడ్డుకోబోయిన భార్య అరుణను సైతం కత్తితో పొడవడంతో ఆమె కూడా మృతిచెందింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ వెంకటప్ప సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.