ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాం

ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాం - Sakshi

► కలెక్టర్‌ అమ్రపాలి

 

హన్మకొండ అర్బన్: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ అమ్రపాలి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ జిల్లా కలెక్టర్లతో స్పెషల్‌ సమ్మరి రివిజన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్‌ సమ్మరి రివిజన్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 696 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేయడంలేదని తెలిపారు.



ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా అందజేశామని, బూత్‌లెవల్‌ ఏజెంట్లను నియమించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమ్మరి రివిజన్ లో ఫారం–6 కింద 11,037, ఫారం 7కింద 1933, ఫారం–8 కింద 6795, ఫారం 8(ఏ) కింద 569 దరఖాస్తులు అందాయని వివరించారు. వీటిలో ఎక్కువ శాతం పరిష్కరించామని తెలిపారు. అదేవిధంగా ఈవీఎంల గోదాం నిర్మాణం కోసం గతంలో కేటయించిన రూ.17లక్షలు లాప్స్‌ అయ్యాయని, వాటికోసం మరోసారి ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో శోభ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top