ఊరంతా కరెంట్ షాక్
మెదక్: విద్యుత్తు స్తంభం మీద మంటలు చేలరేగడంతో ఒక్కసారిగా ఓ గ్రామం మొత్తం విద్యుత్తు షాక్ కు గురైంది. ఈ సంఘటన గురువారం చిట్యాలలో చోటు చేసుకుంది. అనుహ్యంగా జరిగిన ఈ ఘటనలో పలువురు గ్రామస్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యుత్తు శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సింగిల్ ఫేస్ మోటార్ కనెక్షన్ల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభంపై ఉన్న ఇనుపరాడ్ కు కరెంటు సరఫరా కాకపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో సమీపంలోకి 40 ఇళ్లలో సుమారు పదినిమిషాల పాటు కరెంటు షాక్ వచ్చింది. ఇంట్లో ఉన్న విద్యుత్తు మీటర్లను ఆపేసినా కరెంటు సప్లై జరిగింది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కంప్యూటర్ వినియోగిస్తున్న ఓ యువకుడికి గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్తు తీగను అక్కడి నుంచి తొలగించినట్లు విద్యుత్తు శాఖ అధికారులు చెప్పారు.