అనాథలనడం విడ్డూరం
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి
నంద్యాల అర్బన్: భూమా కుటుంబీకుల పిల్లలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనాథలంటూ పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి అన్నారు. భూమా దంపతులను ఎవరూ అంతమొందించలేదని, వారి మరణాల్లో ఒకటి దుర్ఘటన వల్ల జరిగితే మరొకటి సహజ మరణమన్నారు. వారి మరణాలను చిలువలు పలువలు చేసి సానుభూతి మాటలు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో పదేళ్లు ఉన్నపుడు.. ఒక్క పెనుగొండ పరిధిలోనే 480 మంది హత్యలకు గురయ్యారని, అందు లో వంద మంది శవాలే కనిపించకుండా పోయా యన్నారు.
వారి కుటుంబాలు, వారి పిల్లలు అనాథలు కారా? మరి వారి మాటేమిటి? అని గోపాల్రెడ్డి ప్రశ్నిం చారు. శాంతిభద్రతల గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అనంతపురంలో జరిగిన హింసకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూమా పిల్లలను ఎవరూ అనాథలు చేయలేదని, నాగిరెడ్డి మరణానికి పరోక్ష కారణం చంద్రబాబేనని నంద్యాల ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. సొంత మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మానవతా విలువలు శూన్యమన్నారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబును నంద్యాల ఓటర్లు ఎంత మాత్రం నమ్మరని, తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు.