ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్మానేరుకు గండి
• హరీశ్రావు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి
• వైఎస్సార్ హయాంలోనే ఎల్లంపల్లి 80శాతం పూర్తి: ఉత్తమ్
కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేరు రిజర్వాయర్కు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. మిడ్మానేరు రిజర్వాయర్ గండి పడటానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, మంత్రి హరీశ్రావు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది, ఇందులో టీఆర్ఎస్ సర్కారు పాత్ర ఏమీలేదన్నారు. బుధవారం ఆయన శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్అలీ, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి. సంతోష్కుమార్, డీసీసీ చైర్మన్ కటుకం మృత్యుంజయంలతో కలిసి ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులను సందర్శించారు.
ముందుగా ఎల్లంపల్లిని సందర్శించి.. గోదావరి మాతకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటాలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించి 2014 మే నాటికి 86 శాతం పూర్తి చేశామన్నారు. ఎల్లంపల్లితోపాటు తెలంగాణలో ఉన్న మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలోనే పురుడుపోసుకున్నాయన్నారు. టి.జీవన్రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్లే మిడ్ మానేరు ప్రాజెక్టుకు గండి పడిందని ఆరోపించారు.