రోడ్డుపైనే శిశువును వదిలేశారు..

రోడ్డుపైనే శిశువును వదిలేశారు.. - Sakshi


* రోడ్డు పక్కన ఎండలో 2 నెలల చిన్నారి

* నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన


మిర్యాలగూడ టౌన్: ఎర్రగా బొద్దుగా ఉంది.. నుదుట బొట్టు.. బుగ్గపై కాటుక చుక్క.. పక్కన పాల పీక.. చూస్తేనే ఎంత ముద్దొస్తుందో.. ఎర్రటి ఎండలో రోడ్డుపక్కన గుక్కపెట్టి ఏడుస్తోందా పసికందు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రాంనగర్ బంధం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తున్న ఓ ఆటోలో నుంచి మహిళ కిందికి దిగి చిన్నారి నోట్లో పాలపీకను పెట్టి ఖమ్మం రోడ్డులోగల రాంనగర్‌బంధంసమీపంలో రోడ్డు పక్కన వదిలి వెళ్లింది.



నోట్లో నుంచి పాల పీక కిందపడిపోవడంతో ఆ చిన్నారి ఎండలో గుక్కపెట్టి ఏడుస్తోంది. మిర్యాలగూడ నుంచి గరిడేపల్లికి వెళ్తున్న పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు, ఫెయిత్ బంజారా ఆశ్రమ నిర్వాహకుడు డి.హన్యానాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ ఘటన స్థలం వద్దకు వెళ్లి ఆ చిన్నారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సీఐ భిక్షపతి చిన్నారిని సీడీపీవో విశ్వజకి అప్పగించగా నల్లగొండలోని శిశు భవన్‌కు పనికందును తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top