హైవేపై గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
గండేపల్లి :
నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి అది. అటుగా ప్రయాణిస్తున్న వారికి నీలాద్రిరావుపేట వద్ద ఓ దృశ్యం భయకంపితుల్ని చేసింది. మాంసం ముద్దలుగా ఉన్న మృతదేహాన్ని చూసి వారు భీతిల్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిలో నీలాద్రిరావుపేటలోని రుచి దాబా ఎదురుగా బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోయాడు. మృతదేహం పైనుంచి అనేక వాహనాలు ప్రయాణించడంతో మాంసపు ముద్దలా మారింది. సమాచారం అందుకున్న గండేపల్లి, జగ్గంపేటSఎస్సైలు రజనీకుమార్, అలీఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మతిస్థిమితం లేకపోవడమో, రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. అతడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, మృతదేహంపై జంజం, లేత నీలిరంగు ప్యాంట్, తెలుపురంగు చొక్కా, బెల్టు, కొలతలకు వాడే టేపు ఉన్నాయని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 94409 04841, 08852 237733 సెల్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.