శిలాఫలకం ధ్వంసం
ఆర్మూర్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించి ప్రారంభించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియిని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్పందించి భద్ర పరచాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణాభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి రూ.6 కోట్లు కేటాయించడంతో ఈ నెల 6న మంత్రితో శంకుస్థాపన నిర్వహించేందుకు మినీ స్టేడియంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేల సమక్షంలో భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమం నిర్వహించి 20 రోజులు కూడా గడవకముందే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న రేకులను తొలగించి దిమ్మ వెనుక భాగంలో పడేశారు. శంకుస్థాపన నిర్వహించేంత వరకు ఈ శిలాఫలకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మున్సిపల్ పాలకవర్గంలోని పలువురు కౌన్సిలర్లు తమ భర్త పేరును, తండ్రి పేరును, అన్న, కొడుకు పేర్లను సైతం కౌన్సిలర్ల పేర్లతోపాటు ముద్రించుకుని పలువురి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కార్యక్రమం ముగియగానే ఈ శిలాఫలకాన్ని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. దీంతో మినీ స్టేడియంలో పడేశారు.