రియాక్టర్ పేలి.. ఆరుగురి సజీవ దహనం

రియాక్టర్ పేలి.. ఆరుగురి సజీవ దహనం - Sakshi


♦ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం

♦ ఒత్తిడికి పేలిన  కెమికల్ రియాక్టర్

♦ ఆరుగురు దుర్మరణం  మరొకరికి తీవ్రగాయాలు

♦ ముంఖాల్ పారిశ్రామికవాడలో ఘటన

♦  బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

♦  ఘటనాస్థలాన్ని పరిశీలించిన జేసీ సైనీ, ఎమ్మెల్యే తీగల




తెల్లవారుతుండగానే వాళ్ల బతుకులు తెల్లారిపోయాయి. రెప్పపాటులోనే ఆరుగురి జీవితాలు బుగ్గిపాలయ్యాయి. క్షణాల్లోనే గుర్తుపట్టలేని మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఎవరిది ఏ శరీర భాగమో కూడా తెలియని పరిస్థితి.. మహేశ్వరం మండలం మంఖాల్ పారిశ్రామికవాడలోని హసిత ఆరోమాటిక్ కెమికల్ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున కనిపించిన భయానక దృశ్యాలివి. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చత్తీస్‌గఢ్ వాసులు.. మరో ఇద్దరు ఏపీ, తెలంగాణకు చెందిన వాళ్లు. చనిపోయిన ఆరుగురిలో ఐదుగురూ అవివాహితులే. ప్రమాద స్థలాన్ని జేసీ రజత్‌కుమార్ సైనీ, ఎల్‌బీనగర్ డీసీపీ తస్విక్ ఇక్బాల్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలు పార్టీల నాయకులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది.  - మహేశ్వరం


 ఎక్కడ చూసినా మాంసం ముద్దలు.. కమురు వాసనలే.. ఎవరిది ఏ శరీర భాగమో కూడా తెలియని పరిస్థితి. తల ఒక చోట.. మొండెం మరోచోట. కాలు ఒక దగ్గర.. చేయి మరో దగ్గర.. ఎక్కడ చూసినా సిబ్బంది శరీర భాగాలే. చెల్లాచెదురుగా పడి ఉన్న మానవ శరీర భాగాలతో మంఖాల్ పారిశ్రామికవాడలో హసిత ఆరోమాటిక్ కెమికల్ కంపెనీ భయంకరంగా మారింది. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఆరుగురి శరీరభాగాలు తునాతునకలయ్యాయి. మరికొద్ది సేపట్లో ఇళ్లకు చేరుకుందామనుకున్న వారు.. అప్పుడే డ్యూటీకి వచ్చిన ఆరుగురు ఈ పేలుడి ధాటికి మాడి మసై పోయారు. తెల్లవారు జామునే ఆరుగురి జీవితాలు తెల్లారాయి. మృతుల్లో నలుగురు చత్తీస్‌గఢ్ వాసులు కాగా.. మరో ఇద్దరు ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన వారు.     - మహేశ్వరం


మహేశ్వరం మండలంలోని శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన ఉన్న మంఖాల్ పారిశ్రామికవాడలో హసిత ఆరోమాటిక్ కెమికల్ కంపెనీని 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఔషధాలకు చెందిన కెమికల్స్‌ను తయారు చేసి వివిధ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు. ఈ కంపెనీలో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దస్రూ రామ్ (21), కోసారామ్ (21), వర్మ (31), జోగా సోది (28)లు కార్మికులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు (27) కెమిస్ట్ (క్వాలిటీ కంట్రోల్), హైదరాబాద్ ఆర్‌ఎన్‌రెడ్డి నగర్, మీర్‌పేట్‌కు చెందిన సత్యనారాయణ మూర్తి (48) సీనియర్ కెమిస్ట్‌గా ఉన్నారు.



ఆదివారం నైట్ షిఫ్ట్‌కు చత్తీస్‌గఢ్ కార్మికులు హాజరుకాగా, సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వరరావులు ఉదయం షిఫ్ట్‌కు వచ్చారు. కొద్ది క్షణాల్లోనే  మిక్సింగ్ రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కార్మికులు, మరో ఇద్దరు తెలుగు వారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ పేలుడికి ఆరుగురి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మరో కార్మికుడు సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద ఘటనను సెక్యూరిటీ గార్డులు యాజమాన్యానికి వివరించారు.


 ఘటనా స్థలంలో జేసీ, ఎల్‌బీ నగర్ డీసీపీ

ప్రమాద ఘటనను తెలుసుకున్న జేసీ-1 రజత్‌కుమార్ సైనీ, ఎల్‌బీనగర్ డీసీపీ తస్విక్ ఇక్బాల్, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, ఏసీపీ నారాయణ, తహసీల్దార్ గోపీరామ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు, సీఐ మన్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని  వివరాలను యాజమాన్యం, కార్మికులతో అడిగి తెలుసుకున్నారు.


 బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తీగల

ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని అక్కడి కార్మికులు, యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం కంపెనీలోకి వెళ్లి ఆరుగురి మృతదేహాలను పరిశీలించారు. మృతుడు సత్యనారాయణమూర్తి భార్య, కుటుంబ సభ్యులను  పరామర్శించి ఓదార్చారు.


 సమాచారం ఇవ్వలేదు..

రియాక్టర్ పేలిన ఘటనలో తన భర్త మృతి చెందినా.. తనకు యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని, టీవీల్లో చూసి తాను ఇక్కడికి వచ్చినట్లు సత్యనారాయణ మూర్తి భార్య ఎమ్మెల్యే తీగల, ఎల్‌బీనగర్ డీసీపీ తస్విక్ ఇక్బాల్ ఎదుట బోరున విలపించింది. కంపెనీలో పని చేసే కార్మికులకు కనీస రక్షణ లేదని, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకుంది.



మృతుల్లో ఐదుగురు అవివాహితులు

బతుకుదెరువులో భాగంగా ఇక్కడి కంపెనీలో పనిచేస్తూ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన ఆరుగురిలో ఐదుగురికీ  వివాహం కాలేదు. వీరిలో నలుగురు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరొకరు కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు. మరో మృతుడు జీ సత్యనారాయణ మూర్తికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


యాజమాన్యాన్ని శిక్షించాలని ధర్నా

సంఘటనకు బాధ్యులైన యాజమాన్యాన్ని శిక్షించాలని కోరుతూ స్థానిక కార్మిక సంఘ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు ఘటనా స్థలం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే తీగల కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


 రూ. 10 లక్షల నష్టపరిహారం

కంపెనీ యజమానులతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ కృష్ణానాయక్, సర్పంచ్, ఎంపీటీసీలు చర్చలు జరిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేతులు మీదుగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారాన్ని చెక్కు రూపంలో అందజేశారు.


నమూనాల సేకరణ

ఘటన అనంతరం పేలిన రియాక్టర్‌కు సంబంధించిన అవశేషాలను సంబంధిత అధికారులు సేకరించి ల్యాబ్‌కు తరలించారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


ఉస్మానియాకు తరలింపు

ప్రమాదం అనంతరం ఆరుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సునీల్‌ను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top