ఇద్దరు మహిళల ఆత్మహత్య


 గుర్రంపోడు

వేర్వేరు కారణాలతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని గుర్రంపోడు, మోత్కూరు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. గుర్రంపోండు మండలం కొప్పోలు గ్రామ పంచాయతీ పరిధి బుడ్డరెడ్డిగూడేనికి చెందిన  సింగం ముత్యాలు, సింగం ఈదయ్యలు సోదరులు. వీరి మధ్య కొంత కాలంగా స్థల వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో  ముత్యాలు భార్య సింగం యాదమ్మ(40)పై ఈదయ్యతోపాటు అతడి కుమారులు, బంధువులు కలిసి దాడి చేశారు. అనంతరం మనస్తాపంతో సింగం యాదమ్మ పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. యాదమ్మ భర్త ముత్యాలు ఫిర్యాదు మేరకు ఈదయ్య, సత్తమ్మ, వంశీ, సైదులు, బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ప్రోబెషనరీ ఎస్‌ఐ రాములు తెలిపారు. 

కడుపునొప్పి భరించలేక..

మోత్కూరు: 

మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన బాసోజు బుగ్గరాములు భార్య మలీశ్వరి(47) అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరి వివాహాలు జరిగాయి. అయితే ఐదేళ్లుగా మలీశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకలమందు తాగి , సుమారు 20 బీపీ మాత్రలు మింగింది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త ఆమె తల్లి బందరోజు సుగుణమ్మ, అక్క రాజేశ్వరిలు అపస్మారకస్థితిలో పడి ఉన్న మల్లీశ్వరిని గమనించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోత్కూరు ఏఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top