రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


– ఢీకొన్న బొలేరో, ద్విచక్ర వాహనం

లింగాల : మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మురారిచింతల, దిగువపల్లె గ్రామాల మధ్య పులివెందుల – కోమన్నూతల రహదారిలో బొలేరో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో టీవీఎస్‌ వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం అడవిబ్రాహ్మణపల్లెకు చెందిన శంకర్‌ నాయక్‌(50), హనుమంతు(28) వ్యాపార నిమిత్తమై ఉదయం దిగువపల్లెకు వచ్చారు. వారు తిరిగి సాయంత్రం సొంతూరికి వెళ్తుండగా పులివెందుల నుంచి ఎగువపల్లెకు వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాల పాలైన శంకర్‌ నాయక్‌ సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. హనుమంతును పులివెందులకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారని ఎస్‌ఐ తెలిపారు. బొలేరో వాహనం ఎగువపల్లె గ్రామానికి చెందిన శివశేఖర్‌రెడ్డిది. శంకర్‌ నాయక్‌కు భార్య దేవి ఉంది. అయితే వీరికి సంతానం లేదు. హనుమంతుకు ఇంకా వివాహం కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, రూరల్‌ సీఐ రామకృష్ణుడు ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top