రైలు కిందపడి ఇద్దరి దుర్మరణం

రైలు కిందపడి ఇద్దరి దుర్మరణం - Sakshi


గద్వాల: రైలు కిందపడి మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున గద్వాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకంపేట గ్రామానికి చెందిన హరిజన సవారన్న(72) గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండేవాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు 5వ నంబరు కిలోమీటర్‌ రాయి వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి మృతిచెందాడు. సవారన్నకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సవారన్న రైల్వే గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి విధిని అనుసరిస్తూ నిత్యం రైల్వేట్రాక్‌పై తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు. సవారన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



మనస్తాపానికి గురై యువకుడు..

మహబూబ్‌నగర్‌ క్రైం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌​కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీకి చెందిన మురళి(33)కు నిర్మలతో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఓ కొడుకు ఉన్నాడు. అయితే మురళి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య నిర్మలకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేకుంటే తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన మురళీ ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలం నుంచి రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ముస్తాక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top