బాణామతి నెపంతోనే చంపేశారు!

బాణామతి నెపంతోనే చంపేశారు! - Sakshi


తమ్ముడు, మరదలు హత్య కేసులో..

  ఇద్దరు నిందితులకు రిమాండ్

 

 మక్తల్ : బాణామతి చేశారనే అనుమానంతో సొంత తమ్ముడు, మరదలిని అన్నావదినలే హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను మంగళవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. మండలంలోని రుద్రసముద్రానికి చెందిన నడిపి లింగప్ప, చిన్న లింగప్ప (35) సొంత అన్నదమ్ములు. కొన్నిరోజులుగా తమ్ముడు, మరదలు మణెమ్మ (30) లు తమపై బాణామతి చేస్తున్నారని అన్నతోపాటు వదిన లక్ష్మి అనుమానించసాగారు.

 

 దీంతో ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్నారు. ఇందులోభాగంగా ఈనెల 19వ  తేదీ అర్ధరాత్రి ఇంటి వద్ద నిద్రిస్తున్న ఇద్దరినీ గొడ్డలితో నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదట పొలాన్ని కౌలుకు ఇవ్వలేదనే ఉద్దేశంతో తమ్ముడు, మరదలిని హతమార్చినట్టు అందరూ భావించారు.

 

 అయితే పూర్తిస్థాయి విచారణలో మాత్రం బాణామతి నెపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీంతో నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మురళీగౌడ్, ఏఎస్‌ఐలు మల్లయ్య, ఆచారి, స్వామి; కానిస్టేబుళ్లు వెంకటేష్, తారక్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top