పేలుడు పదార్థాలు స్వాధీనం


పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల బోడగుట్టలోని స్టోన్ క్రషర్లపై శనివారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కన్నాల బోడగుట్ట క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్, బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కన్నాల క్రషర్లపై దాడులు నిర్వహించారు.



2,915 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 247 జిలెటిన్ స్టిక్స్‌తోపాటు 11 అమ్మోనియం నైట్రేట్ బస్తాలు, పేలుడుకు వాడే బ్యాటరీ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. పిడుగు వెంకటేశ్, ఫక్రుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు ఈగం లక్ష్మయ్య, గండికోట వెంకటేశ్, హరిప్రసాద్, శ్రీసాయి క్రషర్ యజమాని రమణారెడ్డి, సమ్మయ్యపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. లెసైన్సు లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన నిందితులపై పేలుడు పదార్థాల నిషేధిత చట్టం 9బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top