మద్యం తాగించి మహిళపై గ్యాంగ్‌రేప్‌!

మద్యం తాగించి మహిళపై గ్యాంగ్‌రేప్‌! - Sakshi


మోతె (నల్లగొండ): నల్లగొండ జిల్లా మోతె మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది.  రాంపురంతండాకు చెందిన గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..



రాంపురంతండాకు చెందిన ఓ మహిళ (40) శుక్రవారం (5న) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు సంతకు వెళ్లింది. అక్కడ గొర్రెను కొనుక్కొని ఆటో ఎక్కి రాత్రి ఏడు గంటలకు మామిళ్లగూడెం బస్‌స్టాండ్‌లో దిగింది. అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తుండగా అదే సమయంలో రాంపురంతండాకు చెందిన భూక్య నాగు బైక్‌పై వచ్చాడు. ఆమెను ఎక్కించుకొని విభళాపురం గ్రామ శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు.



అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ఇద్దరు యువకులు ఆంగోతు చందర్, బానోతు శ్రీనుతో కలిసి మద్యం తాగారు. మహిళకు కూడా మద్యం తాగించారు. దాంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం ఆమెపై వారు అత్యాచారం జరిపి వెళ్లిపోయారు. తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వారు ఆదివారం మోతె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top