ఎల్ఐసీ ఆఫీస్బేరర్లకు శిక్షణ
ఎల్ఐసీ ఐసీఈయూ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
టవర్సర్కిల్: కరీంనగర్ ఎల్ఐసీ డివిజన్ యూనియన్ ఐసీఈయూ ఆధ్వర్యంలో అన్ని బ్రాంచ్ల ఆఫీస్బేరర్లకు ఆదివారం యూనియన్ కార్యాలయంలో శిక్షణాతరగతులు నిర్వహించారు. అఖిలభారతస్థాయి ఏఐఐఈఏ నిర్ణయానికి అనుగుణంగా పలు అంశాలను శిక్షణ తరగతుల్లో వివరించారు.
ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ఉపాధ్యక్షుడు కె.వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి వి.రమేశ్ అవగాహన కల్పించారు. ఆహారభద్రత–వ్యవసాయం సంక్షోభం అంశంపై వివరిస్తూ నయా ఉదారవాద విధానాలతో దేశంలో 5.13 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వ్యవసాయంపై ఆధారపడిన 60శాతం ప్రజలు సగటున ఆర్నెల్లకు రూ.10వేలు మాత్రమే సంపాదిస్తున్నారని అన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 110 దేశాలలో 90 స్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆకలిచావుల్లో నాలుగో భాగం మనదేశంలోనే ఉన్నాయని వివరించారు. సభ్యులు సమాజంలో నిజమైన అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎం.రాంమోహన్, వి.రాజేందర్, బి.సురేష్, సంతోష్, కిరణ్, రాజమల్లయ్య, శ్రీరాంనరేష్ తదితరులు పాల్గొన్నారు.