ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
చినగంజాం : ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సం«ఘటన కడవకుదురు– ఇంకొల్లు రోడ్డులో శనివారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షులందించిన సమాచారం ప్రకారం.. మండలంలోని చింతగుంపలకు చెందిన బెజ్జం రాంబాబు (40) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. రాంబాబు భార్య జూలియాకు అనారోగ్యంగా ఉండటంతో చీరాల వైద్యశాలకు తీసుకెళ్లి ఆమెకు వైద్యం చేయించి మందులు ఇప్పించి కడవకుదురు వద్ద ఆగాడు. భార్యను చింతగుంపల పంపించాడు. అనంతరం కొద్దిసేపటికి రాంబాబు తన బైకుపై గ్రామానికి వెళ్తుండగా ఆంజనేయస్వామి విగ్రహం దాటిన తర్వాత ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. టైరు కింద పడిన రాంబాబును ట్రాక్టర్ కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై బి.నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కన్నీరుమున్నీరుగా విలపించిన భార్య
చింతగుంపల దళిత వాడలోని పేద కుటుంబానికి చెందిన రాంబాబు, జూలీయా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నా రు. విజయవాడ వద్ద కూలీ పనులకు వెళ్లి దంపతులు శుక్రవారం స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇంకొల్లు వసతి గృహం లో చదువుకుంటున్న తమ బిడ్డలను చూసుకొని వచ్చారు. భార్య జూలియాకు అనారోగ్యం కావడంతో వైద్యం చేయించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తన భర్త ఇప్పటి వరకూ తన వెంటే ఉండి ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.