రేపు బ్యాంకు యూనియన్ల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్) డిమాండ్ల సాధన కోసం అన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం సమ్మె నిర్వహించనున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్బీఐ మెయిన్ దగ్గర అన్ని బ్యాంకు యూనియన్లతో కలసి ఆందోళన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్కరణల్లో భాగంగా బ్యాంకుల విలీనం, బ్యాంకు ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ను వ్యతిరేకించడంతో పాటు గ్రాట్యుటీ సీలింగ్ను పెంచి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, బ్యాంకుల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తి వేయాలని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన బ్యాంకులను అవసరమైనంత నగదు ఇవ్వాలన్నారు. సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని బ్యాంకు యూనియన్లు సహకరించాలని ఆయన కోరారు.