నేడు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ


- మెగాసిరి ఫంక‌్షన్‌ హాల్‌లో ఉదయం10 గంటలకు నిర్వహణ

- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు

 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగాసిరి ఫంక‌్షన్‌ హాలులో గురువారం ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకులుగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీల్లో వెలుగులోకి వచ్చిన సమస్యలపై చర్చించి రాష్ట్ర స్థాయి ప్లీనరీకి పంపనున్నట్లు వివరించారు. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్లీనరీ అనంతరం ప్రభుత్వానికి సమస్యలపై డిమాండ్‌ను అందజేస్తారన్నారు. అప్పటికీ స్పందించకపోతే పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. జిల్లా ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని కోరారు.

 

వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరిక

నగరంలోని వివిధ కాలేజీల్లో బీటెక్‌ చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థులు బుధవారం గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాలీ, డ్యానీ, ఖాన్, చైతన్య ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు గౌరు వెంకటరెడ్డి పార్టీ కండువా వేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top