నేడు పెదగొట్టిపాడుకు జననేత జగన్
► సజీవ సమాధి మృతుల కుటుంబాలకు పెదగొట్టిపాడులో పరామర్శ
► గ్రామంలో పర్యటించిన పార్టీ నేతలు తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్
ప్రత్తిపాడు : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు రానున్నారు. ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి శుక్రవారం గొట్టిపాడు వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు.
జగన్ ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ మీదుగా 10 గంటలకు ప్రత్తిపాడు వస్తారని, 10.30 గంటలకు పెదగొట్టిపాడు చేరుకుని, ఏడుగురి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. గురువారం ఉదయం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్ స్థానిక నాయకులతో కలిసి మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న విషయాన్ని వారికి తెలిపారు.