తిరుమలలో జీయర్లు చాతుర్మాస దీక్ష ప్రారంభం
తిరుమలలో జీయర్లు చాతుర్మాస దీక్ష ప్రారంభం
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం పెరియకేళ్వియప్పన్ షడగోప రామానుజ పెద్ద జీయర్, నారాయణ రామానుజ చిన్న జీయంగార్ చాతుర్మాస దీక్ష సంకల్పం ప్రారంభించారు. జీయర్లు తొలుత క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూ వరాహస్వామివారిని దర్శించుకుని, తర్వాత ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వారికి స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న పెద్ద జీయర్కు ఆలయ మర్యాదలతో మేల్చాట్ వస్త్రం, చిన్న జీయర్కు నూల్చాట్ వస్త్రం బహూకరించారు. తర్వాత జీయర్ స్వాములు మాట్లాడుతూ, రామానుజ సంప్రదాయం ప్రకారం చాతుర్మాస దీక్ష చేపట్టడం సంప్రదాయమన్నారు. లోక కల్యాణం కోసం శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులు నిర్వహించడం ఆనావాయితీ అన్నారు. ఇందులో భాగంగా ఆలయ తిరువీధుల్లో ప్రదక్షిణగా వచ్చారు.