ఔటర్పై కారును ఢీకొన్న టిప్పర్
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి దర్శనానికి బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. ఔటర్ రింగ్రోడ్డు సర్వీస్ రోడ్డుపై జరిగిన ఈ ఘోరంలో తండ్రీ కూతుళ్లతో పాటు అతని అత్త అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన భార్య, మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డు కొహెడ సర్వీసు రోడ్డుపై శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... హయ త్నగర్ మండలం ఉమర్ఖాన్గూడ (సంఘీనగర్)కి చెందిన నల్ల మాధవరెడ్డి(45)... ఆయన భార్య సురేఖ(37), కుమారుడు భరత్కుమార్రెడ్డి(15), కుమార్తెలు యామిని(17), శిరీష(13), అత్త జక్కిడి లక్ష్మమ్మ(60)తో కలిసి శనివారం సాయంత్రం మారుతీ ఆల్టో కారులో యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా గండిచెరువు వెళ్లే బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ వీరి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మాధవరెడ్డి, ఆయన పెద్ద కుమార్తె యామిని, అత్త లక్ష్మమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. భార్య సురేఖ, కొడుకు భరత్కుమార్రెడ్డి, చిన్న కుమార్తె శిరీషలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. మాధవరెడ్డి వృత్తిరీత్యా టిప్పర్ డ్రైవర్. యామిని కొత్తపేట శ్రీమేధ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిసింది.