ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం


వరంగల్: నగరంలోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. నగర శివారులోని కీర్తినగర్‌లో నివాసముంటున్న గోంగూర స్రవంతి, శాలిని, రవీణను కొంతకాలంగా రంగంపేటకు చెందిన మునిగాల సందీప్ డబ్బుల విషయపై వేధిస్తున్నాడని వారు ఇటీవల మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.



దీంతో పోలీసులు సందీప్‌ను, స్రవంతి, శాలిని, రవీణలను స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు విచారణ అనంతరం సీఐ శివరామయ్య బయటకు వెళ్లిన తర్వాత సందీప్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపానికి గురైన స్రవంతి, శాలిని, రవీణలు టిన్నర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సీఐ వారిని హుటాహుటినా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందిన ముగ్గురు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటనపై సీఐని వివరణ కోరగా.. గతంలో గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో పై ముగ్గురు యువతులు సందీప్ పై ఫిర్యాదు చేయగా ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇప్పుడు ఇక్కడ అదే యువతులు ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు.

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top