దాడి కేసులో జైలు శిక్ష, జరిమానా


 

సత్తెనపల్లి: ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యిరూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వివరాలు... సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన బలిజేపల్లి భరత్, బలిజేపల్లి వినోద్‌కుమార్, బలిజేపల్లి సంజీవరావు, బలిజేపల్లి యాకోబు గత సంవత్సరం మే 15న కాకుమాను రాంబాబు అనే వ్యక్తి పొలం నుంచి వస్తుండగా అతనిపై ఇనుపరాడ్‌లతో దాడిచేశారని కేసు నమోదైంది.  తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుడు సత్తెనపల్లిరూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి రూరల్‌ ఎసై ్స ఎం.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం బలిజేపల్లి భరత్‌పై నేరం రుజువు కావడంతో మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మొహమ్మద్‌ నజీర్‌ ఉల్‌ఏయిన్‌ అతనికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. కేసు పెండింగ్‌ సమయంలో బలిజేపల్లి సంజీవరావు మృతి చెందగా, వినోద్‌కుమార్, యాకోబుపై కేసు కొట్టివేశారు. ప్రాసిక్యూషన్‌ తరుపున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శౌరి వాదించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top