నయీం గ్యాంగ్‌ పేరుతో బెదిరింపులు


ఏఈ భార్య పేరుపై స్థలం రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు




మైలార్‌దేవ్‌పల్లి (రాజేంద్రనగర్‌): గుర్తుతెలియని వ్యక్తులు నయీం గ్యాంగ్‌ పేరుతో ఫోన్‌ చేసి 600 గజాల స్థలాన్ని విద్యుత్‌ అధికారి భార్య పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాలని బెదిరింపులకు పాల్పడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టీఎన్‌జీవోస్‌ కాలనీ 8–5–417 ఇంటి నెంబర్‌లోని స్థలాలకు ఎనిమిది విద్యుత్‌ మీటర్ల కోసం పోకల వీరేశ్‌ అనే వ్యక్తి మూడు నెలల క్రితం దరఖాస్తు చేశారు.



మీటర్ల మంజూరులో జాప్యం జరగడంతో వీరేశ్‌కు కాంట్రాక్టు బిల్‌క్లర్కు ఆశోక్‌ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక సిబ్బంది విజిలెన్స్‌ అధికారులతో దాడి చేయించి రూ.3 లక్షల కరెంట్‌ బిల్లును పంపారు.



ఈ నేపథ్యంలో నయూం గ్యాంగ్‌ పేరుతో ఒక వ్యక్తి అతడికి ఫోన్‌ చేసి మీ ఫ్లాట్‌ సమీపంలోని 600గజాల ఖాళీ స్థలాన్ని ఏఈ విద్యాసాగర్‌ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తే విద్యుత్‌ మీటర్లను వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే చంపుతామని బెదిరాంచాడన్నారు. ఈ బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేసిన వీరేశ్‌ వాటిని పోలీసులకు అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్‌ డేటా ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top