ఏటీఎంనే ఎత్తుకెళ్లబోయారు...
ఇన్నాళ్లు ఏటీఎంలు పగులగొట్టి డబ్బులు పట్టుకెళ్లిన దొంగలను చూశాం.. వీళ్లు రెండాకులు ఎక్కువ చదివినట్లున్నారు.. ఏకంగా ఏటీఎంకే ఎసరుపెట్టడానికి యత్నించి విఫలమయ్యారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.
నంబర్ 216 జాతీయ రహదారి వెంబడి లక్ష్మీపురం ప్రధాన కూడలిలో ఉన్న టాటా ఇండీక్యాష్ ఏటీఎం సెంటర్లోకి మంకీ క్యాప్లు ధరించి వచ్చిన దుండగులు తొలుత సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారు. ఆ తర్వాత మెషీన్ను ధ్వంసం చేసి డబ్బు పట్టుకెళ్లేందుకు యత్నించగా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఏటీఎంకు మోకులు కట్టి వారు వెంట తీసుకొచ్చిన ట్రక్కులో తీసుకెళ్లేందుకు బయటకు ఈడ్చుకొచ్చారు. ఈ క్రమంలో ఏటీఎం సెంటర్ అద్దాలు, డోరు పగిలిపోయాయి. మరి ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమోగానీ మెషీన్ను అక్కడే వదిలి పరారయ్యారు.
ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ. మణికుమార్ సిబ్బందితో కలిసి చోరీ జరిగిన తీరు పరిశీలించారు. ఏటీఎం వద్ద ఉన్న మోకుతాడు, మంకీక్యాప్లు, దొంగలు వదిలివెళ్లిన చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఘటన గురించి తెలుసుకున్న గుడివాడ టాటా ఇండీక్యాష్ ఏటీఎం ఆఫీసర్ మురారి వీర వసంతకుమార్ లక్ష్మీపురం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.