దళితులను అవమానిస్తే ఊరుకునేది లేదు


జిల్లామైదాన ప్రాంత గిరిజన సంఘం అధ్యక్షుడు  జి.లక్ష్మణ



గరివిడి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖమంత్రి సీహెచ్‌.ఆదినారాయణరెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసి వెంటనే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలని జిల్లా మైదాన ప్రాంత గిరిజన సంఘం అధ్యక్షుడు గేదెల లక్ష్మణ డిమాండ్‌ చేశారు. దళితులు చదువుకోరు, శుభ్రంగా ఉండరు, అని మంత్రి వ్యాఖ్యానించడం దళితులను కించపరచడమేనని అన్నారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచించిన రాజ్యాం గంపై ప్రమాణం చేసిన మంత్రి దళితులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.



రాష్ట్రంలో ఎంతో మంది దళితులు అత్యున్నత పదవుల్లో ఉంటే వారందరికీ చదువు లేకుండా ఉద్యోగాలు ఈ మంత్రి ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఈ దేశ ప్రథమ పౌరుడు కూడా ఓ దళిత కుటుంబీకుడే నని గుర్తుచేశారు. దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రభుత్వం, సహచర మంత్రులు ప్రోత్సహించినట్లుందన్నారు. అనంతరం ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ డి.చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పేకేటి చంద్రరావు, గట్టు రవి, గేదెల చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top