ఆలయాల్లో చోరీ
రాప్తాడు : రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలోని సల్లాపురమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆయా ఆలయాల్లోని అమ్మవార్ల సొత్తులు, హుండీల్లోని నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయాల నిర్వాహకులు, గ్రామపెద్దల కథనం మేరకు... గురువారం రాత్రి ముత్యాలమ్మ ఆలయ పూజారి నారాయణప్ప, అతని కుమారుడు అమ్మవారికి పూజలు చేశారు. ఆలయం దగ్గరే 11 గంటలకు వరకు ఉండి గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఈ ఆలయానికి అర కిలోమీటర్ దూరంలోనే సల్లాపురమ్మ ఆలయమూ ఉంది. సల్లాపురమ్మకు ఆలయ పూజారి మాధవరాజు పూజల అనంతరం కుటుంబ సభ్యులతో కలసి కమ్యూనీటి భవనంలో నిద్రించారు.
అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆలయాల తలుపులను పగులకొట్టి లోనికి ప్రవేశించారు. సల్లాపురమ్మ ఆలయంలోని రెండున్నర కేజీల వెండి నగలతో పాటు హుండీలోని నగదును తీసుకెళ్లారు. ఆ తరువాత హుండీని పాలవాయి రోడ్డులో పడేశారు. ముత్యాలమ్మ ఆలయంలోని బీరువాను పగులగొట్టి అందులోని అర కిలో వెండి వస్తువులను తీసుకెళ్లారు. హుండీలోని రూ.10 వేల నగదును అపహరించారు. శుక్రవారం ఉదయమే చోరీ జరిగినట్లు గుర్తించిన పూజారులు గ్రామస్తులకు విషయం తెలతిపారు. ఆ తరువాత సర్పంచ్ దగ్గుపాటి శ్రీనివాసులు, మాజీ సర్పంచు మాధవయ్య, గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఎస్ఐ ధరణిబాబు తమ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్ ఫ్రింట్స్, క్లూస్ టీం, డాగ్ స్కాడ్ను రప్పించారు.