రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పులివెందుల: పులివెందులలోని గోవిందరాజ స్పిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్పిన్నింగ్ మిల్లు సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో తమిళనాడు రాష్ట్రం కడంబంకులం గ్రామానికి చెందిన రాజ్కుమార్(47) మూడేళ్ల నుంచి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు తమిళనాడు రాష్ట్రంలోనే ఉండగా.. రాజ్కుమార్ ఇక్కడే విధులు నిర్వహిస్తూ స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసముండే వారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు తన విధులు ముగించుకొని బయటకు వెళ్లి, తిరిగి రాత్రికి క్వార్టర్స్కు చేరుకోలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు స్పిన్నింగ్ మిల్లు మెయిన్ గేట్ సమీపంలో రోడ్డుపైన వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. గాయాలతో మృతి చెందిన వ్యక్తిని రాజ్కుమార్గా గుర్తించారు. రాజ్కుమార్కు తగిలిన గాయాల దృష్ట్యా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.