మృతుడు దూదేకుల సిద్ధయ్య
అర్ధవీడు (కంభం) : ఓ రైతు పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన అర్ధవీడు మండలం గన్నెపల్లిలో బుధవారం వెలుగు చూసింది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే దూదేకుల సిద్ధయ్య (46) రోజూలాగే మంగళవారం రాత్రి పొలానికి కాపలాకు నంద్యాల మోహిద్దీన్తో కలిసి వెళ్లాడు. బుధవారం ఉదయం సిద్ధయ్య భార్య కూలీలను తీసుకొని మిర్చినారు నాటేందుకు పొలం వెళ్లింది. పొలంలో భర్త చనిపోయి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. మృతుని ఒంటిపైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధయ్యతో ఉన్న నంద్యాల మోహిద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.