చివరి దశలో పంటలపై దృష్టి పెట్టండి
నంద్యాల రూరల్: రబీ పంటలు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో వాటికి సోకే చీడపీడలు, కోతలో జాగ్రత్తలు తదితర వాటిపై దృష్టి సారించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏడీఏలను కోరారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకుల ట్రైనింగ్ అండ్ విజిట్ ఏర్పాటు చేశారు. జిల్లాలో తూర్పు, పడమట దిక్కుల్లో ఒకే విధమైన పంటలు సాగులో లేవని, తూర్పున సాగునీరు ఎక్కువ, పశ్చిమాన నీటి సమస్య అధికంగా ఉందని గోపాల్రెడ్డి అన్నారు. మెట్ట పంటలు కోత దశలో ఉన్నాయని, వాటి దిగుబడి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించాలన్నారు. అనంతరం ఏడీఏలు వారి వారి పరిధిలోని సాగు, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, సాగునీటి పరిస్థితిని వివరించారు. పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న శనగ, పత్తి, ప్రొద్దుతిరుగుడు పంటలను విజిట్ చేశారు. డీడీఏ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.