మోసం చేశావుగా నువ్వే చావు...

మోసం చేశావుగా నువ్వే చావు... - Sakshi


గుంటూరు: తనను వివాహం చేసుకోకుండా, పెద్దలు కుదుర్చిన సంబంధం చేసుకున్న ప్రియుడిపై ఓ ప్రియురాలు కక్ష కట్టింది.  తనను కాదని వేరే పెళ్లి ఎలా చేసుకున్నావని బెదిరించి, ప్రియుడిని ఆత్మహత్యకు ప్రేరేపించి అతడి చావుకు కారణమైంది. దీంతో పెళ్లి అయిన రెండోరోజే ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది.



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈపూరు గ్రామానికి చెందిన మద్దం వెంకటేశ్‌(24)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వారి వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా ప్రియుడు, ప్రియురాలి మధ్య విభేదాలు ఏర్పడటంతో విడిపోయారు.  పెద్దల ఒత్తిడి మేరకు వెంకటేష్ తన మేనమామ కుమార్తెను  శుక్రవారం వివాహం చేసుకున్నాడు.



కాగా ప్రియురాలి సోదరులు చిట్టేటి శ్రీను, నాగేంద్రబాబు శనివారం వెంకటేశ్‌ను పార్టీ చేసుకుందామని పిలిచారు. ముగ్గురూ వెళ్లి పార్టీ చేసుకొన్నారు.  తిరిగి  వచ్చిన తరువాత తమ అక్కను ప్రేమించి ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటూ వారిద్దరూ  వెంకటేశ్‌తో వాదనకు దిగారు.  అనంతరం వారి అక్కను తీసుకువచ్చి వెంకటేశ్‌ వద్ద వదిలి వెళ్లిపోయారు. తనను వివాహం చేసుకోనందుకు నిందించిన ప్రియురాలు, ఇద్దరం కలిసి చనిపోదామని వెంకటేశ్‌ వద్ద ప్రతిపాదించింది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోదామని నిర్ణయించుకొన్నారు. పురుగుల మందు తీసుకొని రహస్య ప్రదేశానికి  వెళ్లారు.



ముందుగా వెంకటేష్‌ పురుగుల మందు తాగాడు. ప్రియురాలు మాత్రం తాగలేదు. తాను ఎందుకు చనిపోవాలని ఎదురు ప్రశ్నించింది. తనకు త్వరలోనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని, మోసం చేసినందుకు నువ్వే చావు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అప్పటికే రెండు గ్లాసుల పురుగుల మందు తాగిన  వెంకటేశ్‌ ఇంటికి వచ్చి జరిగిన విషయం ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉన్నాడు.



కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతున్న వెంకటేశ్‌ను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో జరిగిన విషయం వివరించాడు. దీంతో అతడిని తొలుత వినుకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రయోజనం కనిపించకపోవడంతో నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్‌ సోమవారం రాత్రి మృతి చెందాడు. వెంకటేశ్‌ తండ్రి దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు ఎస్‌ఐ ఉజ్వల్‌ కుమార్‌ తెలిపారు. పరారీలో ఉన్న ప్రియురాలి కోసం గాలింపు చేపట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top