అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని గంగిరెడ్డిపల్లెలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఖాసిం(35)కు 4.50 ఎకరాల సొంత భూమి ఉండగా గత ఏడాది రెండెకరాల భూమిని అమ్మినప్పటికీ అప్పులు తీరలేదు. 2.50 ఎకరాలతోపాటు మరో 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పంటలను సాగు చేశాడు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండేళ్ల నుంచి పంటలు సరిగా పండక రూ. 5 లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో అర్ధంకాక పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖాసింకు తొలుత మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఖాసింకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.