శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
తాడికొండ: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దం డ్రాయినిపాలెంలో శుక్రవారం వారు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలిచి,కలెక్టర్ కాంతిలాల్ దండేను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. శంకుస్థాపన జరగనున్న ప్రాంగణంలో వీఐపీలకు ఒకటి, ఎంఐపీలకు ఒకటి, ప్రధాన వేదిక ఒకటి.. మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావటానికి అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శంకుస్థాపన వేదికను ఉద్దండ్రాయినిపాలెం ఎస్సీ కాలనీకి సమీపంలో ఈశాన్య ముఖ దిశగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.