గుంతల దారులు
► సీఎం ఆదేశించినా ఫలితం శూన్యం
► వాహనదారులకు నిత్యం నరకయాతన
► ఇంకా కొనసాగుతున్న మరమ్మతులు
► వానలు పడితే పనులకు ఆటంకం
సాక్షి, మెదక్: సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశించినా జిల్లాలో రహదారుల పరిస్థితి మెరుగుపడ లేదు. మరింత దారుణంగా మారాయి. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ, మున్సిపల్..ఏ రోడ్లను చూసినా పెచ్చులు లేచి, అడుగు లోతు గుంతలతో దర్శమిస్తున్నాయి. వాహనదారులకు నరకం చూపుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో పంచాయతీ రహదారులు 880 కిలోమీటర్లు, ఆర్ఆండ్బీ రహదారులు 676 కిలోమీటర్లు ఉన్నా యి.
వీటితోపాటు మున్సిపల్, గ్రామాల్లో అంతర్గత రహదారులు మరో వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటాయి. జిల్లా గుండా తూప్రాన్ నుంచి రా మాయంపేట వరకు 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ రహదారుల నిర్వహణ లోపం కనిపిస్తోంది. సీఎం ఆదేశించినా గుంతల రోడ్లను మరమ్మతులు చేయటంలేదు. ఆర్ఆండ్బీ రహదారులు 97.25 కిలోమీటర్ల మేర గుంతలు, పెచ్చులు ఊడి పోయాయి. వీటిని మే 31లోగా మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు 68 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతుండగా ఇంకా 29.25 కిలో మీటర్ల రహదారుల మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది.
పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చని తెలుస్తోంది. భారీ వర్షా లు కురిసిన పక్షంలో మరమ్మతు పనులు మరింత జాప్యం కానున్నాయి. పంచాయతీరాజ్ రహదారుల శాఖ పరిధిలో మొత్తం 112 రోడ్లకు సం బంధించి 238.99 కిలో మీటర్ల మేర మరమ్మతు పనులు ఉన్నాయి. ఇందుకోసం రూ.51.58 కోట్ల నిధులు అవసరం. మరమ్మతు పనులకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కావటంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రస్తుతం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దెబ్బతిన్న రోడ్లను సీఎం ఆదేశాల మేరకు పూర్తి చేయడం సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు స్వయంగా చెబుతున్నారు.
మెదక్లో ప్రయాణం ప్రాణసంకటమే
మెదక్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు మరమ్మతుకు నోచుకోవటం లేదు. హవేళిఘణాపూర్ మండలంలోని సర్ధన–మెదక్ రోడ్డు పనులు ఏ డాది గడిచినా పూర్తి కావడం లేదు. రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఓవైపు తవ్విపెట్టి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం సాగడం లేదు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట, బొడగట్టు, కమ్మరకత్త, సూరంపల్లి, వెల్పుగొండ, ధన్నూర నుంచి కుసంగి, బర్దిపూర్, అచ్చన్నపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లపై అడుగడుగునా గుంతలు దర్శనమిస్తాయి.
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్, బహిరన్దిబ్బ, మందాపూర్, కొమటికుంట తండా, వెంక ట్రావ్పేట, జగిర్యాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పెద్ద శంకరంపేట నుంచి మెదక్కు వెళ్లేందుకు 2016 అక్టోబర్లో మంత్రి హరీశ్రావు మాడ్చెట్పల్లి వరకు రూ.3.75 కోట్లతో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను ప్రారంభించి మధ్యలోనే అపివేశారు. ఉన్న రహదారిని కూడా తవ్వేయడంతో ప్రయాణికులు తరుచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. పాపన్నపేట నుంచి చిత్రియాల్ తండా వరకు ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు
. రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో దళితవాడ వద్ద అరకిలో మీట ర్ మేర రోడ్డు దెబ్బతిని ప్రయాణికులు ఇబ్బందులపాలవుతున్నారు. చిన్న శంకరంపేట మండలంలోని సంకాపూర్–ఖాజాపూర్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రేగోడ్ మండలంలోని వట్పల్లి, చౌదరిపల్లి, ప్యారం, తాటిపల్లి, తిమ్మాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలు పడి ప్రయాణి కులకు, వాహనదారులకు నరకాన్ని చూపుతున్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గంలో
నర్సాపూర్ నుంచి తూప్రాన్ ప్రధాన రహదారిపై నర్సాపూర్ పట్టణ శివారులో రోడ్డుపై రెండు గోతులు పడి నెల రోజులు దాటినా అధికారులు మ రమ్మత్తులు చేయడం లేదు. నర్సాపూర్ నుంచి వెల్దురి మీదుగా తూప్రాన్ వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ. 49 కోట్లు మంజూరు కాగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి స్వంత మండలమైన కౌడిపల్లి నుంచి తిమ్మాపూర్ వరకు ఉన్న రోడ్డు మరమ్మత్తులకు పదేళ్లుగా నిధులు లేక గుంతలమయంగా మారింది. సంగారెడ్డి , మెదక్ జిల్లా కేంద్రాలను కలిపే రోడ్డుపై కొల్చారం మండల పరి ధిలో సంగాయిపేట నుంచి దుంపలకుంట క్రాస్రోడ్డు వరకున్న ఐదున్నర కిలో మీటర్ల రహదారి గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదు. నిధులు ఉన్నా ఏడాదిన్నర నుంచి పనులు చేయకపోడం గమనార్హం.
తూప్రాన్లో ఇలా....
తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని రహదారి మధ్యలో మురికి కాలువపై మూడేళ్ల క్రితం గోతిని తవ్వి వదిలేశారు. వెల్దుర్తి మండలం నెల్లూరు, కొప్పు లపల్లి గ్రామాల మద్యలో ఉన్న రోడ్డు మధ్యలో రెండు ప్రదేశాల్లో గుంతలు ఏర్పడ్డాయి. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీ నుంచి చేగుంట వేంకటేశ్వర దేవాలయం వరకు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా రోడ్డులో గుంతలు ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతు పను లు చేయలేదు. ముప్పిరెడ్డిపల్లి నుంచి కొండాపూర్ వరకు రోడ్డు ధ్వంసమై రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ముప్పిరెడ్డిపల్లి– కాళ్లకల్ కూ డలి వద్ద రోడు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారింది.
వర్షాలు కురిస్తే మరిన్ని ఇబ్బందులు
వర్షాలు ప్రారంభం అయ్యాయి. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యి. ఇది వరకే దెబ్బతిన్న రహదారులు వర్షాలతో మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనికితోడు వర్షాకాలంలో మరమ్మతు పనులు చేపట్టేందుకు అవకాశం తక్కువ. ఒక వేళ ప్యాచ్ వర్క్ చేసినా నాణ్యత లోపించి మళ్లీ రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో భారీ వర్షా లు కురియకముందే రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలు, వాహనదారుల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉంది.