చిరు వర్షానికే తెగిన వంతెన
► తాత్కాలిక వంతెనతో ఇబ్బందులు
► పెంబి ప్రజల రాకపోకలకు అంతరాయం
పెంబి(ఖానాపూర్): పెంబి మండలంలోని మందపల్లి శివారులో పెంబి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన శనివారం రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. మొదటిసారి వర్షానికే ఇలా కొట్టుకుపోవడంతో పెంబి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో మరెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుం దోనని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆది వారం కొన్ని గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయంతో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి.
పక్కనే వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ దినకర్రెడ్డి వెంటనే పొక్లెయిన్తో మరమ్మతు చేయించి తిరిగి తాత్కాలికంగా మరో వంతెనను ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. వర్షం కారణంగా కొట్టుకుపోయిన వంతెన ప్రాంతానికి పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, పెంబి సర్పంచ్ కున్సోత్ రమేశ్, పెంబి ఉప సర్పంచ్ గాండ్ల శంకర్ తదితరులు చేరుకుని సందర్శించారు. మరో తాత్కాలిక వంతెన రహదారి పనులను పరిశీలించారు.