ప్రాణం తీసిన క్రికెట్‌ సరదా


► బంతి తీస్తుండగా బాలుడికి విద్యుత్‌ షాక్‌ 



కొత్తూరు(శ్రీకాకుళం): తోటి స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతున్న ఆ బాలుడ్ని విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కాటేసింది. తాగునీటి మోటారు వద్ద పడిన బంతిని తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం కొత్తూరు మండలం కడుము కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కడుము కాలనీకి చెందిన పారిశిల్లి కృష్ణ, పావనిలు చెన్నైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కుమారుడు రఘు.. తాత బొడ్డేపల్లి రాములు ఇంటి వద్ద ఉంటూ కడుము ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి తోటి పిల్లలతో పాఠశాల ఆవరణలో క్రికెట్‌ ఆడుతున్నారు.



ఈ క్రమంలో బంతి కోసం పరుగులు తీస్తూ సమీపంలో ఉన్న మంతిన కేశవరావు ఇంటి వద్ద ఉన్న బోరు మోటారు వద్దకు వెళ్లాడు. అప్పటికే మోటారుకు విద్యుత్‌ ఎర్తు తగిలి ఉన్నందున ఒక్కసారిగా రఘు విద్యుత్‌ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయగా వారు వచ్చి చూసేసరికే రఘు మృతి చెందాడు. వెంటనే విషయాన్ని రఘు తాతయ్యతో పాటు తల్లిదండ్రులకు, çగ్రామస్తులకు తెలియజేశారు. విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మనవడు మృతి చెందడాన్ని తాతయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ పి.రాజేశ్వరావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. విద్యార్థి కుటుంబానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీఆర్వో బలగ అప్పారావు నాయుడు ప్రమాదవివరాలు నమోదు చేశారు. ఎంపీటీసీ గోవిందరావు విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రఘు తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top