తెలంగాణకు ‘విద్యుత్’ విఘాతం

తెలంగాణకు ‘విద్యుత్’ విఘాతం - Sakshi


♦ ఛత్తీస్‌గఢ్ పీపీఏపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు తీవ్ర అభ్యంతరాలు

♦ పీపీఏకు ఉండాల్సిన కనీస లక్షణాలేవీ లేవని టీఎస్‌ఈఆర్‌సీకి ఫిర్యాదు

♦ ఛత్తీస్‌గఢ్‌కు లాభదాయకం.. తెలంగాణకు నష్టదాయకం

 

 సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ఏకపక్షంగా ఛత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతమంటున్నారు. ‘అనివార్య కారణాలతో కరెంట్ కొనుగోలు చేయకపోయినా స్థిర చార్జీల రూపంలో ఏటా వందల కోట్లను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ధారాదత్తం చేయకతప్పదు. అసలు ఓ విద్యుత్ కొనుగోలు ఒప్పం దం(పీపీఏ)కు ఉం డాల్సిన కనీస లక్షణాలేవీ ఛత్తీస్‌గఢ్‌తో కుదుర్చుకున్న పీపీఏకి లేవు. రెండు సమపక్షాల మధ్య జరిగిన ఒప్పందంగా దీనిని పరిగణించలేం. పూర్తిగా ఛత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉన్న ఈ పీపీఏతో భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరగనుంది’ అని విద్యుత్ రంగ నిపుణుడు, టీ-విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు తేల్చి చెప్పారు.



టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిం చేలా ఈ పీపీఏలో పొందుపరిచిన ఎన్నో అంశాలను మంగళవారం ఈఆర్‌సీకి 10 పేజీల నివేదిక సమర్పించారు. ఆ నివేదికలోని ముఖ్యంశాలు..



 కొనకపోయినా కోట్లు చెల్లించాల్సిందే..

 ఒప్పందం మేర రాష్ట్రం పూర్తి స్థాయిలో విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, ఛత్తీస్‌గఢ్‌కు స్థిర చార్జీలను చెల్లించాల్సిందేనని పీపీఏలో పొందుపరిచారు. అనివార్య కారణాలతో విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, ఈ నిబంధన వల్ల ఛత్తీస్‌గఢ్‌కు ఏటా రూ.1314 కోట్ల స్థిర చార్జీలు చెల్లించాల్సిందే. వార్దా-మహేశ్వరం లైన్ కోసం తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు ముందే దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణకు 1000 మెగావాట్ల కంటే తక్కువ లైన్ కేటాయించినా.. పూర్తి మొత్తంలో స్థిర చార్జీలు చెల్లించక తప్పదు.



 టారీఫ్ నిర్ణయించకుండానే ఒప్పందం..

 విద్యుత్ కొనుగోళ్లకు టెండర్లకు బదులు ఛత్తీస్‌గఢ్‌తో ఎంఓయూ, పీపీఏ కుదుర్చుకోడానికి సరైన కారణాలేవీ లేవు. తక్కువ ధరకే విద్యుత్ విక్రయించేందుకు ఉత్తరాదిన ఎన్నో కంపెనీలు న్నాయి.టెండర్లకు వెళ్తే రాష్ట్రానికి భారీగా ఖర్చు మిగిలేది. కచ్చితంగా ఉండాల్సిన టారిఫ్ ప్రస్తావన ఛత్తీస్‌గఢ్ పీపీఏలో లేనే లేదు.  



 బహిరంగ విచారణ జరపాలి..

 ఒప్పందంలో ఎన్నో కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాధికారం ఛత్తీస్‌గఢ్‌కే వదిలేశారు. తెలంగాణకు వ్యతిరేకంగావున్న ఈ పీపీఏపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ జరపాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పీపీఏను రద్దు చేసుకుని, టెండర్లకు వెళ్లేలా డిస్కంలను ఆదేశించాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top