గర్వపడేలా పాలన..

గర్వపడేలా పాలన.. - Sakshi


సాక్షి, కామారెడ్డి : ‘తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అన్నింటిని అధిగమించి రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో ఉద్యమకారులు గర్వపడేలా పాలన అందిస్తూ, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా, ఆర్థిక ప్రగతిలోనూ అందరికన్నా ముందు వరుసలో నిలిచాం’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ అన్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బుధవారం పలు అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం స్థానిక వరలక్ష్మి గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ఈటెల పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కామారెడ్డి ప్రాంత ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎంతో గొప్పవన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న సందర్భంలో ఎన్నో అవమానాలకు గురైనా, మడమతిప్పని పోరాటం చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‌ నాయకత్వంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని రీతిలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ముందువరుసలో నిలిచిందన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజాకోణంలో పాలన అందిస్తున్నామన్నారు. అభివృద్దికి సంబందించి ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామని, అభివృద్ది చేసుకునే సత్తా మనకే ఉందని నిరూపించామన్నారు.



అన్నింటా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంతో ఆంద్ర రాష్ట్రం ఎందులోనూ పోటీపడే స్థితిలో లేదన్నారు. పరిపాలించుకునే నైపుణ్యం తెలంగాణ ప్రజలకు ఉందని రుజువైందన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తొలినాళ్లలో డిల్లీ వెళ్లినపుడు సరైన గుర్తింపు ఉండేది కాదని, మూడు, నాలుగు నెలల్లోనే మన పాలనను చూసి కేంద్ర మంత్రులు మనల్ని పొగడడం మొదలుపెట్టారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో రెండో శ్రేణి పౌరులుగా బతికిన మనం ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని బతికే పరిస్థితికి చేరుకున్నామని తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా, ఆర్థిక పరిపుష్టి చెందుతూ అభివృద్ది సూచిక 17.82కి చేరుకుని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో అభినందనలు అందుకున్నామని తెలిపారు. ఆర్థిక ప్రగతిలో అన్ని రాష్ట్రాలకన్నా ముందుభాగాన నిలిచి ఉన్నామన్నారు.



సమైక్య రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రాష్ట్రంలో రోడ్లకు రూ.132 కోట్లు మంజూరైతే తెలంగాణకు కేవలం రూ.ఏడున్నర కోట్లు మాత్రమే ఇచ్చారని, తమకు రూ.కనీసం రూ.50 కోట్లయిన ఇవ్వాలని డిమాండ్‌ చేసి, ఏడున్నర కోట్ల జీవో పత్రాలను సీఎం మొఖాన కొట్టి వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్ల కోసం 10 వేల కోట్లు కూడా ఖర్చు చేసుకుంటున్నామని తెలిపారు. పసుపు రైతులు, ఎర్రజొన్న రైతుల పక్షాన పోరాడిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి కష్టాలను తీర్చిందన్నారు. ప్రజల ప్రతీ కష్టంలో టీఆర్‌ఎస్‌ ఉందని, అధికారం చేపట్టిన తరువాత వారి కష్టాలను తీరుస్తున్నామని తెలిపారు.



రాష్ట్రం ఏర్పడిన తరువాత కరెంటు సమస్యనూ పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. అప్పుడు వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఉండేదని, అది పగలు,రాత్రి ఇచ్చేవారని, రాత్రి కరెంటుతో రైతులు కరెంటు షాకులు, పాముకాటులకు గురై మరణించేవారని, అంతేగాక నక్సలైట్ల పేరుతో అమాయక రైతులను పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరిట కాల్చిచంపేవారన్నారు. ఇప్పుడు తొమ్మిది గంటల కరెంటు పగటిపూటనే ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో 24 గంటల కరెంటు కూడా ఇస్తామని తెలిపారు. గతంలో రైస్‌మిల్లులు, ఫ్యాక్టరీలు, కాటన్‌ మిల్లుల వాళ్లు కరెంటు ఇవ్వమని ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్‌లో కనురెప్ప కొట్టేంత కూడా కరెంటు కోతలు లేవన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందన్నారు.



రాష్ట్రంలో సాగునీటి కష్టాలు పూర్తిగా తొలగించేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం ఇంజనీరు వలే ప్రణాళికలు రూపొందిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. 2018 నాటికి ఉత్తర తెలంగాణలో కరువు శాస్వతంగా దూరం కాబోతున్నదని పేర్కొన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్టులు పూర్తయి రైతుల కష్టాలు తీరనున్నాయని తెలిపారు. మేడిగడ్డ, మిడ్‌మానేరు రిజర్వాయర్లు పూర్తయి శ్రీరాంసాగర్‌కు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని పంపడం జరుగుతుందన్నారు. 1962లో నిర్మించిన ఎస్సారెస్సీ లక్ష్యం ఇప్పటికీ పూర్తి కాలేదని, తమ ప్రభుత్వం అన్నింటిని సాధిస్తుందన్నారు. 2018 జూలైణ నాటికి మిడ్‌మానేరు, డిసెంబర్‌ నాటికి ఎల్లంపల్లి ఎత్తిపోతలు పూర్తవుతాయన్నారు.



ఆంద్రా పాలకులకు భూముల ఆక్రమణల నైపుణ్యం ఉంటే, తెలంగాణ ప్రభుత్వానికి పేదల కష్టాలను దూరం చేసే నైపుణ్యం ఉందన్నారు. ఇంటింటికీ తాగునీటిని అందించనున్నామని తెలిపారు.టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గర్వంగా భావించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబొద్దిన్, మున్సిపల్‌ చైర్మన్‌ పిప్పిరి సుష్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రాజమణి, అమృతరెడ్డి, ఎంపీపీలు మంగమ్మ, రాజయ్య, జడ్పీటీసీ సభ్యులు నంద రమేశ్, మధుసూధన్‌రావ్, గ్యార లక్ష్మి, ఆత్మ చైర్మన్‌ బల్వంతరావ్, టీఆర్‌ఎస్‌ నేతలు పున్న రాజేశ్వర్, మామిండ్ల రమేశ్, ఇప్ప శ్రీనివాస్, గైని శ్రీనివాస్‌గైడ్, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, భూంరెడ్డి, పొన్నాల లక్ష్మారెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top