నా బిడ్డను బతికించండి

నా బిడ్డను బతికించండి - Sakshi


చంద్రబాబు దర్శనం కోసం ఆర్నెల్లుగా పడిగాపులు

హామీ ఇచ్చి ముఖం చాటేసిన చినబాబు

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త ఆవేదన


 

విజయవాడ (గాంధీనగర్): అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త. అతని పెద్ద కుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకు ఆలనాపాలనా చూసే భార్య ఏడాది క్రితం మరణించింది. దీంతో తనను ఆదుకోవాలంటూ పార్టీపెద్దల్ని ఆశ్రయించగా మొదట్లో సాయం చేస్తామన్న పెద్దలు తరువాత ముఖం చాటేశారు. సాయం కోసం ఆర్నెల్లుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేడు. ముఖ్యమంత్రిని కలసి గోడు చెప్పుకొందామంటే అధికారులు అనుమతించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పి.వెంకటరమణకు ఇద్డరు కుమారులు. పెద్ద కుమారుడు చైతన్య (6) మూడేళ్లుగా పీడియాట్రిక్ న్యూరో డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయిస్తే మెదడులో సమస్య ఉందని వైద్యులు నిర్థారించారు. ఆరేళ్ల వయసు వచ్చినా వ్యాధికారణంగా చైతన్య నిలబడలేడు.. కూర్చోలేడు. వేరొకరి సాయం కావాల్సిందే.



రెండేళ్లపాటు అతడి బాగోగులు చూసిన తల్లి లక్ష్మి గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలిద్దరి భారం వెంకటరమణపై పడింది. అయినవారి ఆదరణ కరువైంది. దీంతో ఉన్న 1.30 ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుతో చైతన్యకు వైద్యం చేయించాలనుకున్నాడు. ఆ డబ్బు వైద్యపరీక్షలు, మందులకే సరిపోయింది. హైదరాబాద్‌లోని లోటస్ హాస్పిటల్‌లో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం చెన్నై వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.



చెన్నైలోని కంచి కామకోటి చిల్డ్రన్స్ ట్రస్ట్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించగా వైద్యానికి రూ. 6 లక్షల ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఆర్నెల్లుగా తన బిడ్డను తీసుకుని క్యాంప్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడి అధికారులు సీఎంకు తన గో డు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డున పడ్డాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని ప్రాధేయపడినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.



టీడీపీ క్రియాశీల కార్యకర్తని : వెంకటరమణ  

నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఉంది. పార్టీకోసం పదేళ్లు పనిచేశాను. వైఎస్సార్ కడప జిల్లాలో పార్టీ నిర్వహించిన ప్రతి రక్తదాన శిబిరంలోనూ రక్తం ఇచ్చాను. కార్యకర్త కుటుంబానికి ఆపద వస్తే పట్టించుకునేవారే కరువయ్యారు.. మార్చిలో మా జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ను కలిశాను. సమస్య వివరించి, రిపోర్టులు చూపించాను.



తప్పక ఆదుకుంటానని హామీ ఇచ్చారు.. నేటి వరకు పట్టించుకోలేదు. కనీసం జిల్లా పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు.  భార్య చనిపోయింది. ఉన్న కాస్త పొలం వైద్యఖర్చుల కోసం అమ్మేశాను. పని చేసుకుందామంటే పిల్లోడి బాగోగులు చూసేవారు లేరు. ప్రభుత్వ సాయం అందేలా లేదు. అధికారులు అది గో ఇదిగో అంటున్నారు.. ఇక నాకు చావే శరణ్యం..  ప్రభుత్వ పెద్దలు కరుణించి ఆదుకోవాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top