నిన్ను చంపితే తప్ప నియోజకవర్గం బాగుపడదు

ఎమ్మెల్యేపై దాడికి వెళ్తున్న సర్పంచ్ గొల్ల సాయికృష్ణ - Sakshi


7 కోట్లకు అమ్ముడుపోయిన నువ్వా మాట్లాడేది

ఫిరాయింపు ఎమ్మెల్యేపై     టీడీపీ సర్పంచ్ మండిపాటు

ఎమ్మెల్యే మణిగాంధీపై దాడికి యత్నం


 

కర్నూలు సీ క్యాంప్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.7 కోట్లకు అమ్ముడుపోయిన నువ్వా మాట్లాడేది’’ అని టీడీపీకి చెందిన సర్పంచ్ సాయికృష్ణ ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై విరుచుకుపడ్డారు. కర్నూలు మండల సర్వసభ్య సమావేశం శనివారం జిల్లా పరిషత్ ఆవరణలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభమయ్యాక ఎంఈఓ మాట్లాడుతుండగా పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగా లేవని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మణిగాంధీ కోరారు. ఇంతలో అక్కడే ఉన్న ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడు, ఆర్.కొంతలపాడు సర్పంచ్ సాయికృష్ణ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు.

 


‘‘చంద్రబాబుకు అమ్ముడుపోయిన డబ్బుతో మరుగుదొడ్లు కట్టించురా. ఇక్కడ మా రెడ్డి చెప్పిందే వేదం. నువ్వేంది మాట్లాడేది. నిన్ను చంపితే తప్ప కోడుమూరు నియోజకవర్గం బాగుపడదు. నువ్వు కేవలం ఎమ్మెల్యేవే. మా రెడ్డి ఇన్‌చార్జి. ఆయన మాటే అధికారులు వింటారు’’ అంటూ దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే మణిగాంధీ ఒక్కసారిగా బిత్తరపోయారు. రక్షణ కల్పించాలని సమావేశం నుంచే ఎస్పీకి ఫోన్ చేసి కోరారు. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ ములకన్న.. సర్పంచ్‌ను అదుపులోకి తీసుకుని సమావేశం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఎమ్మెల్యే కూడా సమావేశం పూర్తి కాకుండానే బయటకు వెళ్లిపోయారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top