ముద్రగడతో ముగిసిన టీడీపీ నేతల చర్చలు
కాకినాడ : కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొన్ని ప్రతిపాదనలు చేశారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెల్లడించారు. ఆదివారం ఆర్థరాత్రి కిర్లంపూడిలో ముద్రగడతో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు భేటీ అయి చర్చించారు. ఈ చర్చల అనంతరం తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కరరామారావు మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులు ముద్రగడతో భేటీ అవుతారని వారు చెప్పారు. ఆ తర్వాత ముద్రగడ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాపుల రిజర్వేషన్ కోసం ఫిబ్రవరి 5వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వీరు చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.
అయితే తమకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యులను పద్మనాభం దంపతుల నిరాకరించారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షిణీంచే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో ముద్రగడ దంపతులను దీక్ష విరమింప చేసేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా ఆర్థరాత్రి ముద్రగడతో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. అయితే ముద్రగడ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టక ముందు సదరు నేతలు ఇప్పటికే ఓ సారి భేటీ అయిన సంగతి తెలిసిందే.