టార్గెట్‌..ఒంటరి మహిళలు

టార్గెట్‌..ఒంటరి మహిళలు - Sakshi


► రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

►  పక్షం రోజుల్లో మూడు కేసులు

► పోలీసులకు సవాల్‌గా మారిన చోరీలు


ముస్తాబాద్‌ : వరుస చైన్  స్నాచింగ్‌లు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. బైక్‌లపై వస్తున్న దుండగులు ఒంటరి మహిళలపై దాడులకు పాల్పడడం జిల్లా ప్రజలను కలవరానికి  గురిచేస్తోంది. పక్షం రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో మూడుచైన్  స్నాచింగ్‌లు చోటుచేసుకున్నాయి. దుండగులు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. తాజాగా సిరిసిల్ల పట్టణంలో ఓ వ్యక్తి నుంచి చైన్  లాక్కెళ్లే ప్రయత్నంలో ఓ దొంగ పోలీసులకు చిక్కాడు.



చిన్న వాహనాల వారే టార్గెట్‌

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్, ఇతర చిన్న ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిని చైన్ స్నాచర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. జన సంచారం లేని చోట దాడులకు దిగుతున్నారు. ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి శివారులో అటవీప్రాంతం వద్ద గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి వృద్ధురాలి మెడలోంచి మూడుతులాల బంగారు గొలుసు తెంపుకుని పరారయ్యారు. కామారెడ్డి, దుబ్బాక, గంభీరావుపేట మూడు వైపుల రహదారులు ఉండడం, ఎటువెళ్లింది తేల్చుకోలేక పోలీసులు అయోమయంలోపడ్డారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం అందినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్‌ కేసులు ఇప్పటివరకు తేలలేదు.



చిన్న జిల్లాల్లో పెరగాలి నిఘా...

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నదే అయినా ఇటీవల చైన్  స్నాచింగ్‌లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిన్ రోడ్లపై, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు, మధ్యాహ్న వేళల్లో పోలీస్‌ గస్తీ పెంచాలి. బైక్‌లపై అనుమానాస్పదంగా తిరిగే వారిని గమనించాలి. అలాగే ప్రయాణాలు చేసేప్పుడు, పొలం పనులకు వెళ్లేవారు విలువైన బంగారు ఆభరణాలు ధరించవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.



త్వరలో పట్టుకుంటాం

చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యే క బృందాలను నియమించాం. త్వరలోనే  పట్టుకుంటాం. పొరు గు జిల్లా సిద్దిపేటలో కూడా స్నా చింగ్‌లు ఎక్కువగా అవుతున్నా యి. ఇక్కడ స్నాచింగ్‌ చేసి అక్కడకు, అక్కడ చేసి ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. – శ్రీధర్, సీఐ , సిరిసిల్లరూరల్‌



పదిహేను రోజుల్లో జరిగిన చైన్  స్నాచింగ్‌లు

► ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లి శివారులోని సిద్దిపేట జిల్లా మాచాపూర్‌ వద్ద ఇరవైరోజుల క్రితం చైన్ స్నాచింగ్‌ జరిగింది. దుండగుడు ముస్తాబాద్‌ వైపు వచ్చి తప్పించుకుపోయాడు.

► ఈనెల 12న ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జెల్ల బాలరాజవ్వ, ఎల్లయ్యలపై బైక్‌పై వచ్చిన దుండగుడు మూడు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లాడు. బాలరాజవ్వ మెడకు గాయాలు అయ్యాయి. రూ. లక్ష విలువైన బంగారం పోయింది.

► కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద 23న మరో చైన్  స్నాచింగ్‌ జరిగింది. రాచర్లబోప్పాపూర్‌కు చెందిన పందిళ్ల లక్ష్మి, నర్సాగౌడ్‌ దంపతులు పదిరకు వెళ్లి తిరుగుప్రయాణం ద్విచక్రవాహనంపై బయలు దేరారు. రాగట్లపల్లి వద్దకు చేరుకోగానే సిరిసిల్ల వైపు నుంచి బైక్‌పై వచ్చిన దుండగుడు లక్ష్మి మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడు తెంపాడు. దీంతో లక్ష్మి ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిపోగా తీవ్ర గాయాలపాలైంది.

► తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో 23న దుబ్బాక కవిత మెడలోంచి బైక్‌ వచ్చిన దొంగ రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. కవిత ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె కాళ్లు, చేతులు కట్టివేసిన దుండగుడు గొలుసు తెంపుకొని బైక్‌పై పారిపోయాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top