కేసీఆర్.. ఇక నీ మోసాలు చెల్లవు: తమ్మినేని
కరీంనగర్: సీఎం కేసీఆర్ తన గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేయాలనుకోవడం మానుకోవాలని.. ఆయన తీరు మారకపోతే ప్రభుత్వ పునాదులు కదిలిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆదివారం కరీంనగర్లో ముస్లిం సబ్ప్లాన్ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం గర్జనలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హమీలనే అమలు చేయాలని అడుగుతున్నామని, గొంతెమ్మ కోరికలు కోరడం లేదని గుర్తు చేశారు. మాట తప్పితే మెడ నరుక్కుంటా అంటున్నా కేసీఆర్.. ఇప్పటికే 114 వాగ్దానాలను అటకెక్కించాడని విమర్శించారు. మాట తప్పిన సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ప్లాన్లు ఏర్పాటు చేసి నిధులు వెచ్చిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు.