సీఎం అబద్ధాలకోరు: తమ్మినేని

సీఎం అబద్ధాలకోరు: తమ్మినేని - Sakshi


మెదక్ జోన్: రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీఎం కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరని ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. శనివారం మెదక్ పట్టణం, మండలంలో సీపీఎం మహా జన పాదయాత్ర జరిగింది. మెదక్‌లోని ఏరియా ఆస్పత్రిలో తమ్మినేని రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుమ్మరిగడ్డలో కుల వృత్తుల వారితో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ దొరతనాన్ని ప్రశ్నిస్తారనే ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.



నిరుపేదలు ప్రైవేట్ బడుల్లోని ఫీజులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సరిగ్గా లేవని, సగానికిపైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్న సీఎం.. ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఆయన మాత్రం కోట్ల రూపాయలతో ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకున్నట్లు విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపానపోలేదని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top